Thursday 15 August 2013

NANDIRAJU RADHAKRISHNA
POLITICAL COMMENTARIES
(JULY 25-AUGUST 14, 2013)



తెగిన తెలంగాణ..
విభజన పోరులు-భజనపరులు

రాజకీయ మాయాజాలం, ప్రెస్‌క్లబ్, సొంత స్టేటస్ పై రాసుకున్న వ్యాఖ్యలన్నింటినీ ప్రతి 15 రోజులకొక మారు అన్నింటినీ గుదిగుచ్చి ఒక సమాహారంగా నా బ్లాగులో పదిలపరచుకునే కార్యక్రమం ప్రారంభించా. అందులో మొదటి అధ్యాయమే తెలంగాణ అంశంపై 2013 జులై 25 నుంచి ఆగస్టు 15 వరకు సాగిన వ్యాఖ్యాలోచనల క్రమం.



_____________________________________________
14-8-13
*మనదేశాన్ని ఏ పార్టీ పరిపాలిస్తున్నదో తెలుసా?
ఆ! ఐ ఎన్ సి.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఏడవచ్చుగా...
అక్కడే పప్పులో కాలేశావ్. మనకు స్వతంత్రం తెచ్చింది ఇండియన నేషనల్ కాంగ్రెస్. అదిప్పుడు లేదు. ఇప్పుడున్నది ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్, అదీ ఐ.ఎన్.సి. అంటే!! మన జనపథ్ భజన బృందం గురించి ఇదంతా ముందుగా ఊహించే కామోల్సు,. తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అన్నారు. అది తెలుసుకో ముందు..
________________________________________________________
13-8-13


*ఇందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాచేస్తే ప్రభుత్వం లేనట్లేగా! ప్రభుత్వ రహిత రాజ్యంలో మనం చస్తూ బతుకుతున్నాం.. ధైర్యం చేసి ఒక్క ముఖ్య మంత్రి రాజీనామా చస్తే అసలు ఏ గోదవ ఉబ్డదుగా. మంత్రులూ మీ రాజీనామాలను గవర్నరుకు పంపండి. విధులకు హాజరు కాకండి. రాజీనామాచేసిన మీ సంతకాలకు చిల్లి గవ్వ విలువ ఉండదు. తిరుపతి తిరుమల దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడే స్వయంగా రాజ్యాంగ, భగవత్ ధిక్కారణకు పూనుకున్నారు. ఇది ఆత్మద్రోహం, ప్రజాద్రోహమే కాదు, భగవద్రోహం కూడా. భక్తులను మోసగించకండి, తిరుమల ఆలయా ప్రాంగణంలో కాలు పెట్టకండి.

*రాగ ద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తామని, క్రమశిక్షణ పాటిస్తామని, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తామని రాజ్యాంగం, భగవంతుని పై ప్రమాణం చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కాంగ్రెస్ అధిష్టానం, తమ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రౌడీల్లా డిల్లీ వీధుల్లో ఆ నినాదాలేమిటి? వయసు మీరిన వారు కూడా ఆ గెంతులేమిటి? కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తక్షణం పదవులకు పార్టీకి రాజీనామా చేసి, ప్రభుత్వ నివాసాలు ఖాళీ చేసి, జీత భత్యాలు తిరస్కరించి కేంద్రాన్ని పడకొట్టండి. ఈ దౌర్భాగ్య నాటకాలొద్దు. అంతా ప్రచార యావమాత్రమే!! అంతా 'జన్‌పథ్' అమ్మ భజన బృందం.. పార్టీలకు అతీతంగా ఇటువంటి నాటకాల రాయుళ్లను ప్రజలు తరిమికొట్టాలి.
_______________________________________________________
*ఏమిటీ గందరగోళం..పరిష్కారమెప్పుడు?

అసెంబ్లీ సజావుగా జరిగి నాలుగేళ్ళయింది. మంత్రివర్గ సమావేశాలు షెద్యూల్ ప్రకారం జరిగి మూడేళ్ళవుతున్నది. మంట్రులకు ముఖ్యమంత్రిపట్ల గౌరవం, లేదు. మంత్రులంతే ముఖ్యమంత్రికి విశ్వాసమే లేదు. ఎమ్మెల్యేలకు మంత్రులకు శతృత్వం. ముఖ్యమంత్రికి ఎంపీలకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గు మంటుండి. ఇద్దరు మంత్రులను బర్త్‌రఫ్ చేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు జైలుకెళ్ళిన ఘనత గల ప్రభుత్వమిది. సీమాంధ్ర మంత్రులు, తెలంగాణాను పట్టించుకోరు. తెలంగాణ మంత్రులు సీమాంధ్రను చీమను చూసినట్లు చులకన భావం.
శాసన సభ్యులు అసెంబ్లీకి రారు. బీఎసి ప్రకారం సభ నడవదు. శాసన మండలి సభ్యులకు పనేమీ ఉండదు వారెప్పుడూ ఆరో వేలే! సీమ ఎంపీలు తెలంగాణ ఎంప్పెలపై కస్సుబుస్సు. తెలంగాణ ఎంపీలకు సీమాంధ్ర ఎంపీలంటె ద్వేషం. పిసిసిని మంత్రివర్గం పట్టించుకోదు. మంత్రివర్గాన్ని పిసిసి లెక్క చేయదు. ప్రజా సమస్యలపైనే కాదు కనీసం వార్షిక బడ్జెట్ అన్నా పూర్తి నిర్లక్ష్యం. ఏడాదిలో 50 రోజుల సభా సమావేశాలు జరగడం నాలుగేళ్ళలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వానికి అసలు ఉనికే లేదు. ప్రతిపక్షానికి పూర్తిగా పక్షవాతమే. సర్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, ఉన్నతాధికారులు.. చంచలగూడ జైల్‌ల్లో తిష్ఠ వేసుక్కూచున్నారు. ముఖ్య మంత్రి, ఉపముఖ్య మంత్రి,పిసిసి అధ్యక్షుడు పరస్పరం విద్వేషపూరితంగా వ్యవహరిస్తుంటారు. అధిష్టానం వద్ద పితురీలు, ప్రభుత్వంపై అధికార పక్షం దుమ్మెతిపోస్తుంది.
ఏఐసిసి కి రాష్ట్ర కాంగ్రెస్ పై పట్టు లేదు. పిసిసికి అధిష్ఠానమంటే ప్రాంతాల వారీగా చీలి క్రమశిక్షణ ఉల్లంఘించి రోడ్డెక్కి తిట్ల పురాణం. వర్కింగ్ కమిటీ, ఏ ఐ సి సి ల్లో వాగ్వివాదాలు. ఎవ్వరిపై ఎవరూ చర్య తీసుకోరు. ఒక ఎమ్మెల్యే పిసిస్ అధ్యక్షుని తిట్టినా, ముఖ్యమంత్రిని తూర్పారబట్టినా ఏ చర్యలుండవు. కౌన్సిలర్ స్థాయి వ్యక్తి పైకూడా మౌనమే. ఎమ్మెల్యేలు. ఎంపీలు పార్టీ ఫిరాయిస్తున్నా దిక్కులు చూడడం మినహా చలనమే లేదు. పాలన గాడితప్పింది. తన జి ఓలను తానే అమలుచేయలేని దుస్థితి. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు పనిచేయరు. ఆర్టీసీ బస్సులు నడవవు.. నిత్యావసర వస్తువులకు కరవు. ఆకాశంలో ధరలు. ప్రభుత్వోద్యోగులు ప్రాంతాల వారీగా సమ్మెలు. స్కూళ్ళు కాలేజీలు, దుకాణాలు.. బంద్‌లు.
అయినా సరే కేంద్రం కన్నెత్తి చూడదు. పన్నెత్తి మాటాడదు. పత్రికలన్నీ విషపుత్రికలు, ప్రసారమాధ్యమాలు మద్య ప్రవాహాలు. అయినా సరే. తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనళ్ల్లో అందరూ ఒకే బాట. అందరూ అసెంబ్లీకి వెళ్ళకున్నా కలసికట్టుగా డిల్లీ వెళ్ళీ అక్కడ చీలిపోయి కేంద్రం పై, పార్టీ అధిష్ఠానంపై నిరసనలు. ప్రదర్శనలు. డిల్లీలో కళ్ళు, చెవులు, నోరు స్థంభించిన నిర్జీవ యంత్రాంగం. పన్నుల మోత, పోలీసుల చలాన్ల వాతకు అదుపులేదు. ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.
______________________________________________________

*మనుషులు చీలిపోయారు, మనసులు విడిపోయాయి, పత్రికలు, చానళ్ళు, జర్నలిస్టులు, పార్టీలు అన్నీ కకావికలమయ్యాయి. తెగిపోయాయి, మంత్రివర్గం ముక్కలైంది, అసెంబ్లీ చెక్కలైంది, రాష్త్ర ప్రభుత్వం మాయమైంది, విద్యాసంవత్సరం హతమైంది.ఆర్టీసి సమ్మె చేస్తోంది.
.. ఇంకెక్కడి సమైక్యం. కానీ..అవినీతిపరులు సమైక్యం, ఫిరాయింపుదార్లు సమైక్యం, కులం సమైక్యం, వర్గం సమైక్యం, స్వార్ధపరులు సమైక్యం, ప్రైవేట్ బస్ ఆపరేటర్లు సమైక్యంగా బస్సులు నడుపుకుంటున్నారు. టెవీ చర్చల్లో విశ్లేషకులు కూడా సమైక్యం..కాంట్రాక్టర్లు ఘంటాపధంగా సమైక్యం.
ఇదంతా సమైక్య భజన... ప్రజలు బాధలు పడుతున్నారు. రాజకీయ వ్యాపారులు లాభపడుతున్నారు. ఎందుకీ నాటకాలు?

*పార్టీలతో సంబంధం లేదు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, లోక్‌సభ సభ్యులు, అజాగళ స్థానాల్లాంటి ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులు.. తెలంగాణ కోసం కాని, సీమాంధ్ర కోసం కాని చేసింది ఏమిటీ. పిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. అమాయకులు బలవుతుంటే వాళ్ళు పదవులకోసం పాకులాట. కాంట్రాక్ట్‌లు, మంత్రి పదవులు, సొమ్ములు వాళ్ళకు సమ్మె సమ్మెట దెబ్బలు సామాన్యులకు.. నాయకులను కాలరుచ్చుకుని నడిరోడ్డుపై నిలదీయాలి.

*ఈ దేశానికి మరో అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, వీరసావర్కర్, ఒక వివేకానందుడు... అవసరమైన తరుణంలో భారత మాతకు మగధీరులైన ఇద్దరు కుమారులు ఆవర్భవించారు. దేశభక్తి, అబివృద్ధి, జాతీయత, సంస్కృతి, సాంప్రదాయం, హైందవం, అవినీతిపై అవిశ్రాంత పోరాటం తదితర అంశాల పునాదుల పునర్నిర్మాణానికి ఒక నరేంద్ర మోదీ, ఒక సుబ్రహ్మణ్యస్వామి లభించారు. నాలుగువందల ఏళ్ళ పరాయి పాలన స్వాతంత్ర్యానంతరం 66 సంవత్సరాల తరువాత కూడా అనువంశిక పాలన, కుటుంబ బానిసత్వాల కింద నలగవలసిందేనా? నూరేళ్ళు నిండిన ఒక కాలంతీరిన రాజకీయ వృద్ధ అలోచనా విధానం నుంచి విముక్తి పొందదానికి ఇది ఒక అరుదైన అపూర్వ అవకాశం. శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ, పండిట్ మౌళి చంద్రశర్మ, ప్రేమ్ నాథ్ డోగ్రా, ఆచార్య డి పి ఘోష్, పీతాంబరదాస్, ఎ రామారావు, బలరాజ్ మథోక్, అటల్‌బిహారి వాజ్‌పేయీ, ఎల్‌కె అద్వాని వంటి ఉద్దండుల నీడన ఎదిగినా దేశభక్తుల అడుగు జాడల్లో రూపురేఖలు దిద్దుకున్న బిజెపి మనకు ఆశాజ్యోతి. దేశం ఒక దశాబ్దం పాటు మోదీ నేతృత్వంలో సాగితే యువతదే ఉజ్వల భవిత.
___________________________________________________________

 7-8-13


*చతుర్ముఖ పారాయణం కోసం జన్‌పథ్10 ఒక కమిటీ వేసింది. ఇద్దరు నార్త్(అహ్మద్, దిగ్గీ), ఇద్దరు సౌత్(ఆంటోని, మొయిలీ). మొయిలీ కొక్కడికే కాస్త తెలుగు అర్ధమవుతుందనుకుంటా!! ఇది ప్రభుత్వ కమీటీ' కాదు, కంటితుడుపుకోసం కాంగ్రెస్ కమిటీ..మరో శ్రీకృష్ణ కమిటీ మాదిరి, ప్రణబ్ కమిటీ మాదిరి, రోశయ్య కమిటీ లాంటిది.. దీనికి నిర్ణీత కాలమంటూ లేదు... ఇది అనంతం నాయనా...దీనికే మనవాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు. ...

*తెలంగాణ తెచ్చేదీ, ఇచ్చేది.. ఇవ్వకుంటే చచ్చేదీ కాంగ్రెస్సే అని గతంలో టి కాంగ్రెస్ పెద్దలు చెపారు. గమ్మత్తేమిటంటే ఇచ్చిన తరువాత కూడ చస్తున్నది అదే..

*సమైక్య భారతంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అంతా మనదైనప్పుడు తెలంగాణపై అభ్యంతరాలెందుకు, అనుమానాలెందుకు? చదువులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, కాంట్రాక్టులకు మనవాళ్లమందరూ పోటీపడి వ్యాపిస్తున్నప్పుడు ఇంకా ఈ సమైక్యమేమిటి? అంతా రాజకీయ ధనాఢ్యుల డ్రామా!! ఈ సమైక్యవాదులకు ఎన్ని రాష్ట్రాల్లో ఆస్తులున్నాయో, వ్యాపారాలు, పరిశ్రమలు, కాంట్రాక్ట్లు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత తెలుగు వారు తమిళనాడులో, కర్ణాటకలో ఎందరు స్థిరపడలేదు? వారు తెలుగువారు కాదా? డిల్లీ, మహరాష్ట్రలో మనవాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు? మనం పొరుగువాళ్ళనుంచి నేర్చుకోవలసింది రాష్త్ర అభివృద్ధి. దానికి పోటీ పడాలి, అనువంశిక పాలనకు వొంగి వొంగి దణ్ణాలు పెట్టడం, అమ్మ బొమ్మ చూస్తే వణకిపోవడం ఇకనైనా మానుకుంటే లక్షణంగా బాగుపడతాం.
___________________________________________________________

6-8-13

*తెలంగాణ సెగ ఏర్పడ్డప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టీఅరెస్ నేతలు నాటి ముఖ్యమంత్రి పెద్దాయన, రోశయ్యను నోటికొచ్చినట్లు దూషించారు. అభిమానం, చీము, నెత్తురు ఉన్న వ్యక్తి గనుక ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసి ఏడాదిపాటు సాధారణ శాసనమండలి సభ్యుడుగా కొనసాగి దర్జాగా నలుగురిలొ, ప్రజల్లో తలెత్తుకు తిరిగారు. అనేక ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏనాడూ సచివాలయానికి రాకుండా ముఖం చాటెయ్యలేదు. రాష్ట్రంలో, డిల్లీలో అవమానాలు భరిస్తూ చేతులు నలుపుకుంటూ కూర్చోలేదు. ఆయన రాజకీయ అనుభవం, భాషా పటిమ, పాలనానుభవం వన్నె తెచ్చాయి. నెహ్రూ నుంచి సోనియా వరకు అందరి వద్ద ఒక మేధావి గానే గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా ఒక రాజనీతిజ్ఞునిగా గుర్తింపునిచ్చి 78 సంవత్సరాల వయసులో ఆయనను నిలువెత్తు మనిషిగా నిలబెట్టి గవర్నరును చేశాయి. ఆ లక్షణాలు అందరిలో ఆశించడం మన తెలివితక్కువ తనం. ఆయన తెలివిలేని, తెలుగు రాని ముఖ్యమంత్రి కాదు.

*తెలంగాణ ఏర్పడితే .. ఇక్కడి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి... ఇలాంటి పేర్లున్న పత్రికలు పేర్లు ఎలా మార్చుకుంటాయో! .

*అసలు చిక్కల్లా రాజకీయ నిరుద్యోగులతోనే కదా వచ్చింది.. రాష్ట్రాలతోపాటు ఇక అన్నీ డబల్ థమాకా!! గవర్నర్లు, సిఎం లు, మంత్రివర్గాలు, సిఎస్ లు, డిజిపిలు, స్పీకర్లు, కార్పొరేషన్ చైర్మన్లు....ఏమి మన భాగ్యమూ!!

*జాతీయస్థాయిలో టిడిపి బిజెపిని దూరం చేసుకుని, కళ్ళు పొడుచుకున్నా. ఇవ్వాళ పార్లమెంటులో సమైక్యాంధ్రకు అనుకూలంగా టిడిపి ఎంపి ఆందోళనను వెనుకేసుకొచ్చింది ఆ బిజేపి నే...బాబు గారు కనీసం ఒక కన్నైనా తెరిస్తే బాగుంటుంది. శివప్రసాద్ సపెన్షన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది.

*రాజకీయాలకు ఫేస్‌బుక్‌కు ఒక సారూప్యం ఉంది. ఎదుటివారి ముఖం చూడకూడదనుకుంటే ఎఫ్‌బి లో వాళ్ళని బ్లాక్ చేయచ్చు. మనముఖం చూపకూడదనుకుంటే..రాజకీయాల్లో మనం బ్లాక్ అయిపోతాం..మరి చూడండి సి ఎం గారు వారంగా కనబడడంలేదట..మొన్న పేపర్లో కూడా వేశారు. నిజమేనా!!

*ఏడాదిగా రాష్త్రంలో ఊరూ వాడా బద్దలయ్యేట్లు ఇద్దరు ఆడ్సవాళ్ళు (విజయమ్మ, షర్మిల) కాంగ్రెస్ ను చెరిగేస్తుంటే, కడిగేస్తుంటే డిల్లీలో అందరు ఆడాళ్ళు, మగాళ్ళు ఉన్నా పెదవి విప్పలేక పోతున్నారు. ఇక్కడ మాత్రం కొన్ని ఉడతలు తోకలు ఊపుతున్నాయి.
_____________________________________________________________

5-8-13

*నాకు మన దిగ్గీరాజా స్టైల్ లో ఒక బ్రహ్మాండమైన అలోచన వచ్చింది.
ప్రపంచంలో ఇప్పటివరకు అనేక దినోత్సవాలు (దినం అంటే కొందరికి అరికాలు మంట నెత్తికెకుతుంది..తలలో ఉండవలసిన సరుకు అరికాలులో ఉన్నందువల్ల..) తల్లుల దినం, తండ్రుల దినం, ప్రేమికుల దినం, మిత్రుల దినం, స్వాతంత్ర్య దినం, రిపబ్లిక్ దినం, రాష్ట్రావరణ దినం, కుమార్తెల.. కుమారుల.. తాతల.. డాక్టర్ల.. పర్యావరణ... పాత్రికేయుల, ఫొటొగ్రాఫర్ల, కార్మికుల.. పిల్లల (చిల్డ్రన్) ఇంకా ఎన్నో.....వరుస తప్పకుండా జరుపుకుంటున్నప్పుడు.. అన్ని రంగాలలో తరతమ బేధాలు లేకుందా అందరికీ ద్రోహం చేస్తున్న వారందరినీ గౌరవించి, పూజించేందుకు ఒకే రోజు ఎందుకు నిర్ధారించకూడదు? పితృ, మాతృ, భాతృ, మిత్ర, దేశ, జాతి, ప్రాంతీయ, భాషా, రాజకీయ, ప్రజా, ఆత్మ, నమ్మక, యాజమాన్య, కార్మిక, కుటుంబ...(ఈ జాబితా చాంతాడులా పొడుగ్గా ఉంటుంది లేండి) ద్రోహులను ఒకేరోజున స్మరించుకుని, తర్పణం విడవడానికి అందరికీ అమోద యోగ్యమైన ఒక "దినం" ఎందుకు కేటాయించ కూడదు? జాతీయ స్థాయిలో వారికి ఒక స్మారక స్థూపం నిర్మించవచ్చు.ఒక కమిటీ వేయచ్చు. అప్పుడు రాష్ట్ర శాఖలూ ఏర్పడతాయి.

*రాజీనామా చేసిన అందరు ప్రజాప్రతినిధులు ప్రజలు ఒత్తిడి చేయకముందే హైదరాబాద్, డిల్లీలలో తమ ప్రభుత్వ గృహాలు ఖాళీ చేసి, కార్లు స్వాధీనం చేసి, కార్యాలయాలకు వెళ్ళకుండా. పార్లమెంటు, అసెంబ్లీలకు గైర్హాజరు కావాలి, తమ నియోజకవర్గాలకు వెళ్ళాలి. వచ్చే ఎన్నికల వరకు పార్తీ కార్యాలయాల ముఖాలు చూడకూదదు. అందుకు ఎవరైనా సిధ్ధమేనా అని ఉద్యమ కారులు నిలదీయాలి.

*రాజీనామా చేసిన అందరు ప్రజాప్రతినిధులు ప్రజలు ఒత్తిడి చేయకముందే హైదరాబాద్, డిల్లీలలో తమ ప్రభుత్వ గృహాలు ఖాళీ చేసి, కార్లు స్వాధీనం చేసి, కార్యాలయాలకు వెళ్ళకుండా. పార్లమెంటు, అసెంబ్లీలకు గైర్హాజరు కావాలి, తమ నియోజకవర్గాలకు వెళ్ళాలి. వచ్చే ఎన్నికల వరకు పార్తీ కార్యాలయాల ముఖాలు చూడకూదదు. అందుకు ఎవరైనా సిధ్ధమేనా అని ఉద్యమ కారులు నిలదీయాలి.

*ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిందెవరో తెలుసా!! సిడబ్ల్యుసి మహానేతలు సోనియా, రాహుల్, మన్మోహన్, అహ్మద్ పటేల్, గులాం అజాద్, జనర్ధన్ ద్వివేది, చిదంబరం... తదితరులు. వీళ్ళందరూ యుపి, ఎంపి, పంజాబ్,జెకె,గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల మహానాయకులు. వాళ్ళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏళ్ళకిందట తుడిచిపెట్టుకుపోయింది. కలికం వేసి చూసినా ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. ఇన్ని రాష్ట్రాల్లో లేని కాంగ్రెస్ ఎ పి లో మాత్రం ఎందుకుండాలని వాళ్ళ పట్టుదల లా ఉంది.

*నాకొకటే అర్ధం కావడం లేదు. మనం అమితంగా ప్రేమించే, ఆరాధించే, అన్నింటికీ ఆదర్శంగా భావించే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50 రాష్ట్రాల కలయిక. మరి మనకు అన్ని రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి. 50 రాష్ట్రాలుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అదే విధంగా 15 రాష్ట్రాలున్న సోవియెట్ రష్యా, ప్రపంచం లో మరో కమ్య్యూనిస్టు దేశం చైనా 23 రాష్ట్రాలు, 5 స్వయంప్రతిపత్తి ప్రాంతాలు, 4 ప్రత్యేక మునిసిపాలిటీలు, మరో రెండు ప్రత్యేక పాలనా ప్రాంతాలతో అభివృద్ధి చెందినప్పుడు మరో పదో, పదిహేనో కొత్త రాష్ట్రాలు ఏవ్ర్పడితే భారత్ ఎందుకు అభివృధ్ధి చెందదు, ఏ విధంగా బలహీన పడుతుందో ?  మరి తెలుగు వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విధానం లో అనుసరించిన తీరుపై అభిప్రాయభేదాలు, వాదోపవాదాల జోలికి వెళ్ళడం లేదు. ఎవరి మనోభావాలు వారికుండడంలో తప్పులేదు.. అంశం రాజకీయ స్వార్ధం కానంత వరకు. అమెరికా, రష్యా, చైనా, జర్మని, జపాన్, ఆస్త్రేలియాల్లో ఉద్యోగాల్లు చేస్తూ, ఆస్తులు సంపాదించుకుని, పౌరసత్వాలు పొంది స్థిరపడి అక్కద రాజకీయ పదవులు అనుభవిస్తున్న "ఘనమైఅన ప్రవాస భారతీయ మేధావులు, దేశభక్తులు" రాష్ట్రం దగ్ధమవుతుంటే పన్నెత్తి ఎందుకు మాట్లాడరు? సర్వం (అ)రాజకీయం...

_____________________________________________________________

3-8-13

*అవునూ.. నాకొక అనుమానం. నిన్నటివరకు కాంగ్రెస్ లో నేను కోస్తా, నిన్ను కోస్తా అంటూ గంగ వెర్రులెత్తిన మహిళా నేత ఇప్పుడు మటుమాయమైందేమిటబ్బా..వైఎస్సార్ మరణించినప్పుడు గుండెలు బాదుకుంటూ పొర్లి దొర్లి రోదించిన మనిషేమయిందబ్బా? రోశయ్య సిఎం కాగానే రంగం మార్చి ఆయన్ను ఆకాశానికెట్టి, తరువాత కిరణ్ చుట్టూ ప్రదిక్షణలు చేసిన భక్తి గీతాలు పాదిన మహిళా శిరోమణి ఎక్కడుందబ్బా! నాలుగేళ్ళపాటు మందలిలో సోనియా భజనకు అంకితమైన నూకాలమ్మ అడ్రసు ఎవరికైనా తెలుసా? మాట్లాడితే కోస్తా అంటుంది. ఇప్పుడు ఏ సొరకాయలు కోస్తున్నదో! ఊరకే అనలేదు గోదావరి ఈతకు తోకలు పట్టుకోకూడదని.

*పొద్దుటినుంచి జీ టీవీ భద్రాచలం ఎవరిది అంటూ నిప్పు పెట్టింది. అయోధ్యతో పోలిక తెచ్చింది. అగ్గికి ముందే ఆజ్యం సిద్ధం.. పక్కనే విసనకర్ర కూడా గాలికోసం..

*రాష్ట్ర విభజనే కాదు, ఇక పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, భార్యా భర్తలు సంసారం చేయలన్నా, పిల్లలను కనాలన్నా, విడాకులు తీసుకోవాలన్నా మొత్తం సోనియా నాయకత్వంలో, దిగ్గీ మార్గదర్శకత్వంలో ఏర్పడే కమిటీ నిర్ణయిస్తుంది. {ఇద్దరూ ఇద్దరే ! "నీకు నీ వారు లేరు.. నాకు నా వారు లేరు" - 23 సంవత్సరాలుగా యు పిలో, పదేళ్ళుగా ఎం పి లో కాంగ్రెస్ కు దిక్కూ దివాణం లేదు. ఆ రాష్ట్ర నేతలు మనలను పీడిస్తున్న పీతలు}
________________________________________________________


2-8-13

*అయిపోయింది. సర్వం పూర్తయిన తరువాత ప్రజా సెంటిమెంట్ మంటల్లో "కాలిన తెలుగు చేతులకు" ఇటలీ కంపెనీ తయారు చేసిన దిగ్విజయ్ బ్రాండ్ "విభజన" ఆయింట్మెంట్ మన ఎంపీలకు ఇచ్చారు. రాజీనామా దూకుడుతో దూసుకెళ్ళిన కేంద్ర మంత్రులకు చట్టసభలో "విభజనపై" ప్రజా గళం వినిపించుకునే గొప్ప, అరుదైన అవకాశం ఇచ్చేసరికి సాగిలపడి "మా వాక్‌శూరత్వం వినండి సభలో" అంటూ జబ్బలు చరుచుకుంటూ బయటపడ్డారు. పదిమంది ఎంపీలు రాజీనామా చేశారట(అవి ఎటూ ఆమోదం పొందవు. కేంద్రమంత్రుల రూటు వేరు. ఎంపీల రూటు సపరేటు. అక్కడ ఇక్కడ అంతా 'రాజీ' నాటకం. ఎంపీల బృందాన్ని గమనించండి. ఎక్కువమంది వై.ఎస్. అభిమానులు. (ఆత్మరక్షణ )రక్త సంబంధం కాదనలేక రేపు ఒక్క ఉదుటున ఏ గోడైనా దూక వచ్చు. వీరిని నమ్ముకుంటే ప్రజలు నట్టేట మునగరా?
కేంద్ర మంత్రిపదవుల్లో ఉన్నవారు "సోనియా వీణా తంత్రులు మీటుకుంటూ" అన్ని పార్టీలు విభజనకు అంగీకరించాయి ఇప్పుడేమీ చెయ్యలేము, అని నోరెళ్ళబెట్టి పదవులు కాపాడుకున్నారు. కావూరి, పనబాక, కిశోర్‌చంద్రదేవ్ వేరయ్యారు. కిల్లి, శీలం, పల్లం, పురంధేశ్వరి ఒకటయ్యారు.
బొత్స ఆంధ్ర సి ఎం దక్కించుకునే దింపుడు కళ్ళెం ప్రయత్నం. ఆయన ఇవ్వాళ గాంధిభవన్లో విలేఖరులతో మాట్లాడుతూ, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపొటే రేపు బిజెపి ఇస్తుంది, దానికి ఎందుకా అవకాశం ఇవ్వాలి అని కాంగ్రెస్ ఇప్పుడే ఇచ్చేసింది" అన్నారు. . అమంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి కేంద్రంలో ప్రభుత్వం ఖాయమని అంగీకరించినట్టే కదా? సి ఎం కిరణ్ మూడురోజులుగా ముఖ దర్సనమే లేదు, నాలుగు గోడల మధ్య సమీక్షల్లో సతమతం.. ఎవరు తేలుతారో ఎవరు మునుగుతారో?

*హైదరాబాద్ లో బి బ్యాంక్ పెట్టి, తిరుపతిలో పార్టీ పెట్టి, పాలకొల్లులో పల్టీకొట్టి, మూసీలో మునిగి, యమునలో నిమజ్జనమై, పార్లమెంటులో కాలెట్టి, డిల్లీలో కాపురమెట్టి, రాష్ట్రాన్ని తగలెట్టి, కాంగ్రెస్ కు నిప్పెట్టి.. హ-- హ-- ఎలాయినా "అన్న"ది అయిరన్ లెగ్..

*ప్రజాప్రతినిధుల ఈ రాజీనామాలను స్పీకర్ ఎలాగూ ఆమోదించడు. ఉద్వేగం ఉద్రిక్తల మధ్య రాజీనామాలు చెల్లవంటాడు. డిసెంబరు 9 తరువాత రాజీనామాలేమయ్యాయి. వివిధ కారణాల చేత ఎమ్మెల్యేలు రాజీనామాచేస్తే వాటిని నాణ్చి నాణ్చి కాలహరణం చేసి నీరు గార్చిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులారా! రాజీనాటకాలొద్దు. మాట తప్పకండి, మడమ తిప్పకండి. చరిత్రహీనులుగా మిగలకండి. రాజకీయ వ్యాపారాలు, వ్యాపార రాజకీయాలు ఒకే ఒరలో ఇమడని కత్తులు. అవి చివరకు మీ కుత్తుకలపై పడతాయి. కేంద్రంలో రాజకీయ కుట్రలు నడిపిస్తున్న కాంగ్రెస్ సంగతి తెలియని అమాయకులెవరూ లేరు. మంత్రులు రాజీనామాలు గవర్నర్‌కుఇవ్వండి. ఎమ్మెల్యేలు నేరుగా స్పీకర్‌కు ఇవ్వండి. ఎమ్మెల్సీలు చైర్‌మన్ కు ఇవ్వండి. మళ్ళీ ఆ ప్రాంగణాల్లో కాలు పెట్టకండి. నిజాయితీ నిరూపించుకోండి. ఎలాగూ అసెంబ్లీని సుషుప్తావస్థలో పెట్టి గవర్నర్‌కు పాలనా బాధ్యతలు అప్పగిస్తారు. అప్పుడు మీ చేతుల్లో ఏమీ ఉండదు. క్వార్టర్లు, కార్లు స్వాధీనం చెయ్యండి.

____________________________________________________________

1-8-13

*నాలుగేళ్ల పాటు 10 జిల్లాల తెలంగాణాను తగలబెట్టి చోద్యం చూసిన 128 సంవత్సరాల అఖిలభారత కాంగ్రెస్ ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు దిగ్గీ రాజా చేత దివిజయంగా అగ్గి పెట్టించి వినోదం చూస్తున్నది. తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సేటూ రాకుండా కాంగ్రెస్ నెత్తిన చెంగేసుకున్నది. ఆంధ్ర ప్రాంతంలో ఏడాదికిందత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సిపి ప్రభంజనానికి దిమ్మతిరిగి కాంగ్రెస్‌కు కళ్ళు బైర్లు కమ్మాయి. అయినా ఇంకా బుద్ధిరాలేదు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్న అత్యాశతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా విధివిధానాల రూపకల్పన లేకుండా తెలంగాణ ప్రకటించి రెండోచోట కూడ చేతులు కాల్చుకుంది.  నాలుగేళ్ళపాటు తెలంగాణ ఉద్యమంలోఅసువులు బాసింది, ఇప్పుడు సీమాంధ్ర ఆందోళనలోనూ సమిధలవుతున్నది అమాయక, బడుగు బలహీన వర్గాల ప్రజలే, అందులోనూ యువతే! రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు నాటకాలు ఆడుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి సంతానం, బంధుగణం భద్రతల మధ్య నగరాల్లో క్షేమంగా ఉన్నారు. పల్లె పల్లెలో ఉద్రిక్తతపెరిగి ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలారా ...

*"నమస్తే తెలంగాణ" ఒక నిర్దిష్ట అభిప్రాయం చెబుతున్నది. అదేమాదిరి "ద హాన్స్ ఇండియా" ఆంగ్ల దినపత్రిక తెలంగాణను సమర్ధించింది. ఆ రెందు పత్రికల చానళ్ళు తేలంగాన మద్దతుదారులే! మిగిలిన పత్రికలు, చానళ్ళు ఎందుకు తమ అభిప్రాయం చెప్పలేకపోతున్నాయి? ముందు నుంచి నా ప్రశ్న అదే. ప్రసార మాధ్యమానికి పక్షపాతం ఉండవచ్చా/ఉండకూడదా? సామాజిక బాధ్యత లేదా? కేవలం వ్యాపారమేనా? ఎడిటర్లూ ఏసి గదుల మేధావి ఆలోచనలు కట్టిపెట్టి మనుషుల్లో మెసగండి."సంపాద"క లక్షణాలు విడనాడండి.
____________________________________________________________

31-7-13

*ప్రజలను ఇబ్బంది పెట్టే బందులొద్దు. అక్కడకూడా ఆత్మహత్యలను ప్రేరేపించకండి నాయకులూ! సీమాంధ్రలోని ప్రజా ప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు)అందరూ తెలంగాణను అడ్డుకోవాలంటే ఒకే ఒక మార్గం. పార్లమెంటులో బిల్లును, అసెంబ్లీలో తీర్మానాన్ని నిరోధించాలంటే ఏకతాటిపై నిలిచి అసలు అందుకు ఆస్కారం లేకుండా మూకుమ్మడి రాజీనామాలు చెయ్యండి. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు లేకుండా పార్లమెంటులో బిల్లెలా పాస్ అవుతుంది? అదే మాదిరి తీర్మానం పని లేకుండా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వచ్చి సభే రద్దవుతుంది. ముందుగా సీమాంధ్ర కేంద్రమంత్రులు రేపటి మంత్రివర్గ సమావేశానికి గైరహాజరవ్వాలి కాకుంటే డిసెంట్ నోట్ రాయాలి. ముందు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యాలి. ఇంతటి శక్తి, సీమాంధ్ర భవిష్యత్ పై ఆసక్తి, అసలా ధైర్యం ఉందా?

*తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కేంద్రం(కోర్ కమిటీ, సి డబ్ల్యూసి, యుపిఎ మిత్రపక్షాలు) ప్రకటించి 24 గంటలైంది. అప్పటినుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి, బొత్స సత్యనారాయణ ఉరఫ్ సత్తిబాబు అనబడే సమైక్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాని కనబడడం లేదు, వినబడడం లేదు. ఎవరికైనా అచూకి తెలిసిందా.. ఇప్పటివరకు సత్తిబాబుకు కోటరీగ పనిచేసిన నలుగురు వీర విలేఖరులు కూడ మాయమయ్యారు. రూట్ మర్చుకునే రోడ్ మ్యాప్ తయారీలో వారు నిమగ్నులయ్యారట.. వివరాలు తెలిస్తే కాస్త చెప్పండి.

*రాష్ట్రం తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా భాష తెలుగే.. ఆంధ్ర భాష, తెలంగాణ భాష అనరు. లిపి ఒకటే.మనుషుమందరిలో రక్తం ఎరుపే! రెండుచోట్ల తెలుగు పత్రికలే.. తెలుగు చానళ్ళే.. మనం తెలుగు వారమే.. ఇప్పటికైనా తెరపై విశ్లేషకుల ముఖాలు మార్చండి..కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనలకు చోటివ్వండి.

*FOR THIS STATE OF AFFAIRS, SELF INTERESTED POLITICIANS HAVE TO BE BLAMED. THEY HAVE BEEN FULLY ENGAGED IN MINTING MONEY AND TOTALLY NEGLECTED THE STATE DEVELOPMENT. POLITICIANS ENTERED REAL ESTATE, EDUCATION, MEDICAL, MEDIA,CONTRACTS .. BUSINESS AND STARTED EARNING CRORES..ALL THE C Ms EXCEPT YSR CONCENTRATED ON DEVELOPMENT IN AND AROUND HYDERABAD ONLY. WHY THEY HAD NOT APPLIED THEIR MIND ON OTHER AREAS. YSR WAS THE ONLY ONE WHO STARTED PROMOTING IRRIGATION PROJECTS, IITs, UNIVERSITIES, PORTS, INDUSTRIES ETC.. IN ALL DISTRICTS GIVING EQUAL IMPORTANCE. EVEN HIGH COMMAND BOWED BEFORE HIM. WHAT HAD HAPPENED FOR THE LAST 4 YRS..THE STATE HAS GONE TO DOGS.. ANDHRA/SEEMA POLITICIANS CRAWLED BEFORE SONIA FOR THE REASONS BEST KNOWN TO EVERY ONE. PEOPLE OF THE AREAS CONCERNED SHOULD CATCH HOLD THE COLLARS OF THOSE WHO STOOD BY INTEGRATED STATE AND TALKED ALL COCK AND BULL STORIES.. WHY THE 175 MLAs AND 25 MPs HAVE KEPT QUIET WITH OUT QUITTING. THE PROBLEM IS ALWAYS WITH THE LEADERS AND PEOPLE REMAIN SUFFERERS..

*
_______________________________________________________________

30-7-13

*ఇక్కడ మరొక్క విషయం. కె సి ఆర్ పార్లమెంటుకు వెళ్లడని, మత్తులో ఫారం హౌజ్‌లో పడుకుంటాడని, తెరాస కుటుంబ పార్టీ అని, ఛాతీ మీద చెంచాడు మాంసం, శరీరంలో వంద గ్రాముల కండ లేదని అటు కాంగ్రెస్, టిడిపి నేతలు ఏవేవో అన్నారు. కాలు కదపకుండా డిల్లీని దాసోహమనిపించిన ఘనుడని ఇప్పటికైనా ఒప్పుకుని నోళ్ళు కట్టేసుకుంటారా? తెరాస కాంగ్రెస్‌లో విలీనం అయిన తరువాతకూడా అయనే హవా నడిపించుకుంటాడు. కాంగ్రెస్సోళ్లందరూ సీట్లకోసం ఆయన దగ్గర క్యూలు కడతారు.. మొత్తానికి కె కే, కడియం వంటి గాలిపటాలు అదృష్టవంతులు.

*అభివృద్ధి తెలంగాణ కావాలి, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం లేదని చెప్పిన నగర మంత్రులు ముఖేశ్, నాగేందర్.. ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తారా? మంత్రిపదవులకు రాజీనామా చేస్తారా?

*మూడేళ్ళుగా అసెంబ్లీ చుట్టూ ఉన్న ఇనుప కంచెను ఇప్పటికైనా తొలగించి, ప్రజాస్వామ్యానికి, గాంధి మహాత్మునికి చెర నుంచి విముక్తి కలిగిస్తారా? పాలకులారా?

*తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేస్తామన్న 15 మంది మంత్రులు, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి, కాంగ్రెస్‌నే వీడిపోతానన్న రాయపాటి, తెలంగాణా సామాజిక న్యాయమంటూ గాండ్రించిన చిరంజీవి, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, తెరవెనుక నుండి బహుకృత వేషాలు వేస్తున్న సమైక్యవాది రాజ్యసభ సభ్యుడు రాజకీయ తెరంగేట్రం నుండి తప్పుకునేందుకు శుభ ముహూర్తం ఎప్పుడు నిర్ణయించుకున్నారు. సమైక్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇకనైనా సిఎల్పీ, గాంధిభవన్ చాయల్లో కనబడకుంటా తప్పుకుంటారా? బుల్లి తెరలముందు ముఖాలకు ముసుగేసుకుంటారా? అక్రమ ఆర్జననతో సొల్లు కార్చుకున్న తెలుగు టివి చానళ్ళు, విశ్లేషకులు, అగౌరవ ఎడిటర్లు ఇప్పుడేమి చేస్తారు?

*ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని తగలబెట్టేందుకు ఎవరో ఎక్కడినుంచో రారు. బిస్కట్ల కోసం నాలుకలు జాపుకుని, తోకలు ఊపుకునే జాగిలాలు, కల(లా)ల మేధావులు, గొట్టాల బేహారులు ఎప్పుడూ సిధ్ధమే..

*మధ్యాహ్నం డిల్లీ నుంచి ఒకాయన ఒక ఆంధ్రప్రాంత రాష్ట్ర మంత్రికి ఫోన్ చేసి.. మీకు, మీ మీడీయాకు పనేమీలేదా? గత రెండు ఎన్నికల ప్రణాళికల్లో, అంతకుముందు సిడబ్ల్యుసి తీర్మానంలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందా? ఎందుకు ప్రజలను రెచ్చగొడతారు? అన్నారు. 1999 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ప్రస్తావానే లేదు. తెరాస ఆవిర్భావానికి ముంది టిడిపీని, ఎన్‌డియేను ఇరకాటంలో పెట్టేందుకు సిడబ్ల్యుసిలో రెండో ఎస్సార్సిపై తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. 2004 ప్రణాళికలో రెండో ఎస్సార్సీ అని పేర్కొన్నది. ఆ తరువాత యుపీఎ ఉమ్మడి కార్యక్రమంలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణను ప్రస్తావించి తెప్ప తగలేసింది. ఇక 2009 ప్రణాళికల్లో ప్రణబ్ కమిటీకి చెల్లు చీటీ చెప్పి రోశయ్య కమిటీని తెరపైకి తెచ్చింది. వైఎస్సార్ మరణంతో రోశయ్య ముఖ్యమంత్రి కాగానే ఆ కమిటీకి మంగళం పాడి, డిసెంబరు 9న గందరగోళం సృష్టించే ఒక ప్రకటన చేసి, పది రోజుల్లో ఉపసమ్హరించుకుని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది ఈ కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించాడు. 2010 ఫిబ్రవరి 3 న శ్రీకృష్ణకమిటీకి ప్రాణం పోసింది. ఆ కమిటీ డిసెంబరు 30 నాటికి నివేదిక సమర్పించినా కేంద్రంలో పట్టించుకున్న నాధుడే లేడు. కాంగ్రెస్ నాయకులను తక్కువగా అంచనా వేయకండి అంటూ... చూస్తుండండి ఏమి జరుగుతుందో అన్నాడు. నిజమే ఏమిజరుగనుందో?? (1999, 2004, 2009 రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికల్లో తెలంగాణ ప్రస్తావనలు ఇవిగో అని చూపాడు).

*పొద్దుటినుంచి తెలుగుచానళ్లలో ఒకటే కక్కులు ఎత్తిపోస్తునారు. మరో వైపు(కుక్కల)కాట్లటలు. సీమాంధ్ర వైపు కన్నేశాయి తోకూపుకుంటూ. అక్కడ ఏదో జరగరానిది జరుగుతున్నట్లు. సెమాంధ్రలో కేంద్ర బలగాలు మోహరించారని ఒకటే కూతలు. రాష్ట్రం విడిపోయినా, పోకున్నా అది వేరే విషయం..విలేఖరుల విహారాలు విమానాల్లో..కొందరివి స్పాన్సర్డ్ ప్రయాణాలు, ఎంత అదృష్టం. నాలుగు రోజులపాటు ప్రత్యేక ఆఫర్లట..  మూడేళ్ళుగా ప్రజల గోడు పట్టించుకోకుండా సంపాదనలో మునిగిన మంత్రులందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు(అజాగళస్థనాలు)కూడా కట్టకట్టుకుని పిలవని పేరంటానికి డిల్లీలో వాలిపోయారు, ఈ రాష్ట్రాన్ని అనాధను చేసి. వీరికి మనం ఓటేయ్యాలా? సోనియాకు సాష్టాంగపడతారా? రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా? రాజీనామాలు చేస్తారా? పార్టీతో తెగతెంపులు చేసుకుంటారా?
____________________________________________________

29-7-13

*మనకున్న (పీ)నేతలు విభజన పరులు కారు. పూర్తిగా జనపథ భజనపరులు. తలవొంచమంటే సాష్ఠాంగ దండ ప్రమాణాలు చేసే అతి విశ్వాస పరులు. "అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట.." . రాయలేలిన సీమ రతనాల సీమ అదే "రాయలసీమ." ఆ కవితా, కదన కుతూహలాలను నేడు రాయల సీమ నేతలు సోనియా పాదాక్రాంతం చేయడం సిగ్గుమాలిన తనం. కర్నాటకంలో విలీనమైన తెలుగు ప్రాంతాలు పోను ఇప్పటికి మిగిలిన నాలుగు జిల్లాలను కూడా నిలబెట్టుకోలేని నాయకులు దొరికారు. స్వార్ధ పరత్వంతో నలుగురూ ఇద్దరుగా విడిపోవాలని కోరుకోవడం సిగ్గుమాలిన తనం. రాష్ట్రం మూడు భాగాలైనా, నాలుగు భాగాలైనా.. ఫరవాలేదు. సీమ ఔన్నత్యం నాలుగు పాదాల మీద అలా తలెత్తుకుని నిలబడేట్లు చూడండి. రాయల తెలంగాణ అని కొందరు, ఆంధ్రలో ఐక్యమవ్వాలన్న అలోచన మరి కొందరు. సీమలో నాయకులు చలిచీమలు గా మిగలడం ప్రజల దౌర్భాగ్యం. సంస్కృతి, సంప్రదాయం, భాష ను యాసను కనీసం మిగిల్చండి. మీరు తాకట్టు పెట్టుకోండి కానీ సీమను చీల్చకండి.

*ప్రాంతీయ బేధాల్లేకుండా ప్రతిచోటా ప్రజలు కాలరు పట్టుకుని ఈ నేతలను నిలదీయాలి. సమైక్యాన్ని కొన్నాళ్ళు భుజాలు మార్చుకుంటూ ప్రజలను ఏమార్చి పబ్బం గడుపుకుంటున్నారు. ఉద్యమం, త్యాగాలు సంభంధం లేకుండా ప్రచారానికి ఏర్పాటైన పరాన్నభుక్కు బ్యానర్లు, లెటర్ హెడ్ సంస్థలు. ప్రజలతో సంబంధాలు, సిద్ధాంతాలు, పట్టుమని పదిమంది లేని డబ్బు సంపాదన మేధావి వర్గం ఇది. సంచలనాలతో ఉనికి కోసం తాపత్రయం..రాజకీయ రంగులు మార్చే వ్యక్తులు ఇక్కడ పెద్ద నాయకులు. ఉత్సవ 'విగ్రహ' ఆరాధకులు. వీరిపట్ల తస్మాత జాగ్రత్త!!
__________________________________________________

25-7-13

*తెలంగాణ అంతా ఖాయమైనప్పుడు, ఖరారైనప్పుడు, అధిష్టానం ఔనన్నప్పుడు ఇంక బెంగేముంది. కాంగ్రెస్‌లో కొట్లాటలెందుకు? ఉభయ ప్రాంతాలవారిని కట్టడి చెయ్యచ్చుగా!! ఉత్సవ విగ్రహాల హడావిడి మినహా మూల విరాట్టులు కదలడం లేదు, మెదలడం లేదు! ఎందుకో, ఏమిటో!! మధ్యలో మీడియా గంగ వెర్రులేమిటో?

1 comment: