ఖద్దరుధారి, నిబద్ద వ్యవహారి, ఆంధ్రగాంధి నిరాడంబర మహామనీషి వావిలాల
కాశీనాధుని నాగేశ్వరరావు, ప్రకాశం పంతులు, బూర్గుల రామకృష్ణారావు, తెన్నేటి విశ్వనాథం, గౌతులచ్చన్న, కాళోజి నారాయణరావు వంటి ఉద్దంద నేతల వరుసలోని వారు శ్రీ వావిలాల. వావిలాల ప్రజల మనిషి, గొప్ప పార్లమెంటేరియన్. ఇరవయ్యో సంవత్సరంలోనే 1926 లొ సత్తెనపల్లి బాల కవితా కుటీరం వారి "విద్యార్ధి" త్రైమాసికపత్రికకు సంపాదకత్వం వహించారు. ఆ తరువాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు చెంత మద్రాసులో "ఆంధ్రపత్రిక" దినపత్రికలో రెందేళ్లపాతు ఉపసంపాదకుడుగా పని చేసారు. మధ్యలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని తొమ్మిది నెలలౌ జైలు జీవితం గడిపారు. 1928లోనే "జ్యోతి" పక్షపత్రికకు సంపాదకులుగా, "సహకారం" మాస పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
Saturday, 27 April 2013
భలే మంచి రోజు.. పసందైన రోజు..
ఏప్రిల్ 27,2013 శనివారం. ఈ రోజుకి ఎంత ప్రాముఖ్యత. రాష్ట్ర చరిత్రలో ఇంతటి శుభ ఘడియలు స్వాతంత్ర్యానంతరం ఎప్పుడూ వచ్చి ఉండవు. గురువారం అర్ధరాత్రి గ్రహణ విడుపుతో సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తలుపులు తెరుచుకుని జనం భగవంతుని దర్శించుకుని ఊపిరి పీల్చుకున్నారు.
24 గంటలు గడిచాయో లేదో రాష్ట్రంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. విపత్తులు ఒకదాని వెంట కాకుండా ఒకేసారి నెత్తిన పడితే ఎలా? అసలే ఎండలు మండుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అగ్నిప్రమాదాలు. కర్మాగారాల్లో పేలుళ్ళు. కరెంటు కొరతకు తోడు చార్జీల వాత, పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోయి రిజర్వాయర్లలొ నీటి నిల్వలు దిగ జారాయి. ప్రభుత్వాసుపాత్రులు అనారోగ్యంతో కునారిల్లి పోయాయి. మహిళలకు రక్షణ శూన్యం. పిల్లల కిడ్నాప్ లు, దారుణ హత్యలు. నిత్యావసర సరుకుల ధరలూ ఆకాశంలో. చివరాఖరికి సినిమా టిక్కెట్ల ధరలూ చుక్కలనంటాయి.
పులిమీద పుట్రలా.. ప్రజల బాధలు వొదిలేసి.. యాత్రా స్పెషళ్ళ ప్రారంభ, ముగింపు, వార్షికోత్సవాల వేడుకల్లో నేతలు తలనిండా మునిగారు. జనం బాధలు కాదు. అన్ని పార్టీలది అధికార ఆకాంక్ష..
*మాజీ ముఖ్యమంత్రి, టిడిపి శాశ్వత అధ్యక్షుడు చంద్రబాబు మీకోసం 2817 కిమీ పాదయాత్ర ముగింపు పండుగ విశాఖలో అట్టహాసంగా.
*ముఖ్యమంత్రి కిరణ్ సహచర మంత్రులతో కరీంనగర్ వంగరలో ఇందిరమ్మ ఉత్సవం.
*ప్రారంభంకాని వైఎస్సార్ రచ్చబండకు వైఎస్సార్సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ (మాజీ)ఆడబడుచు సబితమ్మ అత్తిల్లు చేవెళ్ళనుంచి శ్రీకారం.
*తెలంగాణ ప్రాణంగా ఏర్పడ్డ టి ఆర్ ఎస్ అవిర్భావ పుష్కరోత్సవం గులాబి గుభాళింపు ఆర్మూరులో.
*తెలంగాణ సాధన కోసం జె ఎ సి నాయకత్వంలో బి జె పి ఆతిధ్యంలో డిల్లీలో సంసద్ యాత్రకు సెకిందాబాద్ నుంచి కదలిన రైలు చక్రాలు..
ఇంతకంటే రాష్ట్ర ప్రజలకు అదృష్టం ఏమైనా ఉంటుందా? జన్మలు ధన్యం
Thursday, 18 April 2013
భద్రాద్రివాసా! భక్త జనప్రియా!!
సీతారాముల కల్యాణం చూతము రారండీ...
అదిగో భద్రాద్రి, ఇదిగో గౌతమి చూడండీ.. అని గానం చేస్తూ పవిత్ర యాత్ర స్థలం భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా ఉవ్వెత్తున లేచే కడలి తరంగాల్లా కదలివస్తున్నారు. తెల్లవారితే అభిజిత్ లగ్నాన సీతమ్మ, రామయ్యల పెళ్ళి వేడుకను కనులారా చూసి తరించేందుకు చీమల పుట్టలమాదిరి కదలి వస్తున్నారు. మండుటెండలను , వసతి సదుపాయాలను కూడా ఆలోచించకుండా పల్లెలు, పట్టణలు తేడా లేకుండా పిల్లాపాపలతో బస్సుల్లో, రైళ్ళ్లలో, ఇతర వాహనాల్లో రాష్ట్రం నలుమూలల నుంచే కాక రాష్ట్రేతర ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు.. పురాణ ఇతిహాసాల్లో సీతారామకల్యాణం అత్యంత ప్రాశస్త్యం పొందింది. గోదా కల్యాణం, రుక్మిణీ కల్య్యాణం, పార్వతీ కల్యాణం, శ్రీనివాస కల్యాణం.. ఇలా అనేక కల్యాణాలు ఉన్నా.. సీతా రామకల్యాణానికి ఉన్న ప్రత్యేకత వేరు. శ్రీ రామచంద్రుని జన్మదినానే కల్యాణం, పట్టాభిషేకం జరగడం అన్నిటికీ మించిన విశేషం.
చైత్ర శుద్ధ నవమినాడు సీతారాముల కల్యాణం కమనీయంగా, అత్యంత రమణీయంగా, అంగరంగ వైభవంగా లక్షలాది భక్తుల సమక్షంలో జరుగుతుంది. అసలు ఆయన అయోధ్యరాముడే. అయినా కల్యాణానికి భద్రాచలానికి అవినాభావ సంబంధం ఉంది. పవిత్ర గోదావరి తీరాన ఖమ్మం-తూర్పు గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే అహ్లాద ప్రకృతి సౌందర్యం భద్రాద్రిది. కర్మభూమి అయిన భారతావనిలో నిత్య, దీప ధూప నైవేద్యాది పూజా కార్యకలాపాలతొ భక్తజనకోటిని విశేషంగా ఆకర్షిస్తున్న 25 రామావతార పుణ్యక్షేత్రాలలో పావన గోదావరి జలాలతొ పునీతమైన భద్రగిరిది ప్రత్యేకత. ఇది ఖమ్మం జిల్లాకు తూర్పున గోదావరి ఒడ్డున దండకారణ్యంలో నెలకొని ఉంది. పడమటి కనుమలలో పుట్టి, పవిత్ర గోదావరి భద్రాద్రి వరకూ తూర్పుగా ప్రవహించి, అక్కడినుంచి దక్షిణ వాహినిగా ఉష్ణగుండములవరకూ సాగి పాపికొండల మధ్యగా తూర్పుదిశగా పరవళ్ళు తొక్కుతూ బంగాళాఖాతం లో కలుస్తుంది. వియద్గంగ నుంచి నుంచి గౌతమి మహర్షి ఈ నదిని ఈ పుణ్యస్థలికి గొనితేవడం వలన ఇక్కడ గోదావరిని గౌతమిగా వ్యవహరిస్తారు.
బ్రహ్మాండపురాణంలో భద్రాచల క్షేత్ర ప్రాశస్త్యం వివరిస్తూ; పితృవాక్య పాలన నిమిత్తం రాముడు వనవాస సమయంలో దండకారణ్యంలో ప్రవేశించి పర్ణశాలనొకటి నిర్మించుకుని వసిస్తూ ఒకనాడు వనమంతా పర్యటించి అలసి, సీతా లక్ష్మణ సహితుడై ఒక శిలాఫలకంపై సేద తీర్చుకునేందుకు ఉపక్రమిస్తాడు. రామ పాదస్పర్శతో పర్వతుడు అసలు రూపం దాల్చి వారికి మ్రొక్కి సకల పూజాలు నిర్వహిస్తాడు. స్వామి పర్వతుని భక్తికి మెచ్చి రామావతార పరిసమాప్తి అనంతరం వైకుంఠమునకేగి తిరిగి చేతనోద్ధరణ నిమిత్తం భూలోకానికి వస్తానని, అప్పుడు అక్కడే స్థిర నివాసమేర్పరచుకుంటానని వరమిస్తాడు. మేరువు కుమారుడుగా భద్రనామంతో జన్మించే పర్వతునిపై తాను వసిస్తానని, పంచభూతములు ఉన్నంతవరకు భద్రుడు తనను సేవించి కల్పాంతమున దివ్యలోక ప్రాప్తి పొందుతాడని కరుణిస్తాడు. శ్రీరామచంద్రుని వ్యాఖ్యానుసారం మేరు పర్వతుడు, మేరుదేవి దంపతులకు బ్రహ్మ ప్రత్యక్షమై పుత్ర సంతానం అనుగ్రహిస్తాడు. పెరిగి పెద్దయిన భద్రుడు శ్రీరామదర్శనార్ధం గొప్ప తపస్సు ఆచరిస్తాడు. భద్రుని తపోదీక్షకు ముల్లోకాలు తల్లడిల్లగా దేవతలు వైకుంఠవాసుని శరణుకోరతారు. శ్రీమహావిష్ణువు నిజసపరివార సమేతంగా సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాంచంద్ర రూప ధారియై శంఖ చక్ర ధనుర్బాణాలతో ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. ఆ దివ్య మంగళ విగ్రహ సౌందర్యానికి భద్రుడు ముగ్ధుడై పలు విధాల స్వామిని కీర్తించి తన శిరస్సుపై సీతాలక్ష్మణ సమేతంగా శాశ్వతంగా ఉండిపోవాలని ప్రార్ధిస్తాడు.
భద్రునికిచ్చిన మాట మేరకు స్వామి అక్కడే స్థిరపడిపోతాడు. రామావతారంలో పునరావిర్భవించిన విష్ణువు వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి రాముడని, భద్రగిరి నారాయణుడని ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముని వామ అంకమున ఉపవిష్ఠురాలైనందువల్ల లక్ష్మీదేవి ప్రత్యేకంగా నిజ స్వరూపంలో చతుర్భుజ కనకవల్లీ తాయారు పేరిట స్వామి సన్నిధి చేరుకుంది. విరజానది గౌతమి గర్భమున కలసి అంతర్వాహినిగా ఉండడం వలన ఈ క్షేత్రమునకు కలియుగ వైకుంఠమనే పేరు సార్థకమైంది. అప్పటినుంచి స్వామిని మహర్షులు, దేవతలు అదృశ్యరూపములో నిత్యం నిశాసమయంలో పర్వదినాల్లో వచ్చి భక్తిప్రపత్తులతో కొలుస్తారని ప్రతీక. గౌతమి ప్రభావం వలన, సీతారామ వ్రత విధానం వలన, స్వామికి కల్యాణం చేసే క్రమం వలన కలిగే ఫలితాలు అనంతమని, అన్ని దానములకంటే అన్నదానము మహిమ అత్యంత ఫలప్రదమని, పంచ మహాపాతకులుకూడ పాపములనుండి విముక్తులై శ్రీరామ సాన్నిధ్యం చేరుకుంటారని ప్రతీతి. సూతమహర్షి ఈ క్షేత్ర మహిమను శౌనకాదులకు ఇలా ఉపదేశించారు.
శృణ శౌనక భూయోపి భక్తకల్పవరోహరేః!
మహత్యం రామ భద్రస్య శిఖర స్థితే!!
దమ్మక్కకు దర్శనం..
శ్రీరామ భక్తురాలగు భద్రిరెడ్డిపాలెం వస్తవ్యురాలు పోకల దమ్మక్కకు శ్రీరామచంద్రుడు ఒక రాత్రి స్వప్నమున దర్శనమిచ్చి భద్రగిరిపై నివాసమేర్పరచుకున్న తనను మానవ మాత్రులు గుర్తించలేక పోవడంతో తనను సేవించి తరించలేక పోతున్నారని తెలపగా..మర్నాడు దమ్మక్క స్వప్న వృత్తాంతమును గ్రామస్తులకు తెలిపి స్వామికోసం వెదకులాట ప్రారంభంచగా దట్టంగా ఉన్న ఆకులు. తీగల మధ్య విగ్రహాలు సాక్షాత్కరించాయి. గోదావరి పుణ్య జలాలతో స్వామి విగ్రహాలకు అభిషేకం చేయించి పందిరి నిర్మించి అనుదినం మహతాళ ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తుండేది. గ్రామాధికారి భద్రిరెడ్డి చొరవతీసుకుని మంటపం నిర్మించి ఏటా సీతారామకల్యాణం జరిపించేవాడు.
ఆతరువాత భక్తరామదాసు ఉదంతం యావత్తు జగమెరిగినదే.. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం చర్విత చరణం అవుతుంది. కంచర్ల గోపన్నను కారాగార విముక్తుని చేసిన తానీషా ప్రభువు తన పొరబాటు గ్రహించి రాముని భక్తుడగుటచే గోపన్నను రామదాసుగా కీర్తించాడు. భద్రాద్రి, పాల్వంచ తాలూకాల ఆదాయాన్ని స్వామి కైంకర్యానికి సమర్పిస్తున్నట్లు తానీషా ప్రకటించాడు. అంతేగాక ప్రతి ఏటా జరిపే సీతారామ కల్యాణానికి మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు వంశ పారంపర్యంగా పంపే విధంగా కట్టడి చేసాడు. నేటికీ సీతారాముల కల్యాణంలో ఆనాడు రామదాసు చేయించిన మంగళసూత్రాలు, చింతాకు పతకం, పచ్చలపతకం, రత్నకిరీటం, వజ్రాలపోగులు, కలికి తురాయి, వజ్రాలవైరముడి.. మొదలైన దివ్య ఆభరణాలు అలంకరిస్తారు. వీటన్నింటినీ భక్తుల దర్శనార్ధం చిత్రకూట ప్రదర్శనలో భద్రపరచారు. రామదాసు కాలంలోనే కాశీ నుంచి శ్రీ విశ్వనాథ లింగాన్ని తెప్పించి ఆలయం దక్షిణభాగాన క్షేత్రపాలకునిగా ప్రతిష్ఠించారు.
భద్రాద్రికి ఉత్తర దిశగా సుమారు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న పర్ణశాలలో ఆనాదు సీతారాములు నివసించారని, అక్కడినుంచే రావనుడు సీతాపహరణం చేశాడని పురాణాలు వల్లిస్తున్నాయి. భద్రాద్రికి ఆగ్నేయంగా మూడు మైళ్ళ దూరంలో గోదావరి గర్భంలోని అగ్నిగుండంలో ఆదిశేషుడు హోమం చేసినట్లు పేర్కొంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని ఉష్ణగుండంగా వ్యవహరిస్తారు. ఈ గుండంలోని మధ్య ప్రాంతంలో నీరు ఉడుకెత్తుతూ, అంచులవెంట అతి చల్లగా ఉంటుంది. ఈ జల ఊత నిరంతరం. సమీపంలోని జటాయు పర్వతం, లక్ష్మణగుట్ట, శ్రీరామగిరి తదితర ప్రాంతాలు పవిత్ర దర్శనీయ క్షేత్రాలయ్యాయి. భద్రాద్రి కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా పారిశ్రామిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుని నిత్యం కళకళ లాడుతున్నది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు భద్రాచలం కేంద్రం. అతవీ ఉత్పత్తుల విక్రయ స్థానాలు ఏర్పడ్డాయి. తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు షెడ్యూల్డ్ ప్రాంతంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. భద్రాద్రి ఆలయం, పరిసర ప్రాంతాలు శరవేగంతో కొత్తరూపం సంతరించుకుంటున్నాయి. ఉపాధికల్పనకు అనేక వనరులను వినియోగంలోకి తెస్తున్నారు. భద్రగిరి శ్రీరామచంద్రుని వేనోళ్ళ కీర్తిస్తూ కవులు అనేక కృతులు చేశారు. ఆలయ కర్తృత్వంలో కాలానుగుణ్యంగా అనేక మార్పులు సంభవించాయి. 1883లో తూము నరసింహదాసు అనౌ మహా భక్తుడు నిజాం ప్రభుత్వానికి పరిస్థితి వివరించి దేవస్థానం పునరుద్ధరణకు పూనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనంతరం ఆల్యం దేవాదాయ శాఖ అధీనమైంది. 1964లో అద్భుత శిల్ప సంపద ఉట్టిపడే కల్యాణ మంటపాన్ని నిర్మించారు. ప్రతి శ్రీరామనవమిన రాష్ట్రప్రభుత్వం తరఫున ముఖ్యమంతి స్వామికి స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తెస్తారు. శుక్రవారం కల్యాణానికి కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు, మంత్రివర్గ సభ్యులు పలువురు ప్రముఖులు ఆయన వెంట వస్తున్నారు. శనివారం జరిపే పట్టాభిషేక శుభఘడియలకు రాష్ట్ర గవర్నరు నరసింహన్ సతీ సమేతంగా వస్తున్నారు.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే!
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం!!
Wednesday, 17 April 2013
తెలుగుకు అఖండ గౌరవం తేజోత్రయం...
కవిత్రయం మనం చేసుకున్న పుణ్యం. తెలుగునేలకు పరిమళాలు మరోసారి వీచినవేళ నేడు. అదేమాదిరి ముగ్గురు జ్ఞానమూర్తుల ప్రభలు వెలిగిన నేల. నాడు భారతాన్ని తెనిగీకరించిన నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ. నేడు జ్ఞాన పీఠ పురస్కారాన్ని అందుకున్న తెలుగు తేజోమూర్తులు.. విశ్వనాథ, సినారే, రావూరి..
జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ముగ్గురితో పరిచయం నిజంగా ఏజన్మలో పుణ్యఫలమో..ఈ ముగ్గురినీ కలిసే, పలకరించే, వారి పలుకులు రాసే భాగ్యం ప్రసాదించింది పాత్రికేయ వృత్తే.
విజయవాడలో ఈనాడు ప్రతినిధిగా ఉన్నప్పుడు విశ్వనాథవారి అనేక సాహితీ కార్యక్రమాలకు హాజరై వార్తారూపం ఇచ్చే అవకాశం కలగడం నిజంగా అదృష్టమే. అలాగే సినారే నారాయణరెడ్డి గారితో పరిచయం మూడు దశాబ్దాలుగా ఇప్పటికీ సాగుతుండడం సత్కర్మ ఫలమే..
ఇక రావూరి గారు. ఆయనతో రెండు రకాల సంబంధ బాంధవ్యాలు. కవి-విలేకరి గా ఒకటి. ఇండియన్ఎక్స్ప్రెస్ సహచర పాత్రికేయ చాయాచిత్ర గ్రాహకుడు రావూరి కోటేశ్వరరవు తండ్రిగా ఆ పెద్దాయనతో మరో అనుబంధం.. అతి చనువుగా భుజాన చేయివేసి అప్యాయంగా పలకరించే మహోన్నత వ్యక్తి..ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించడం తెలుగు వారికి, తెలుగు భాషకు అమందానంద భరితం. ఆయనను అభినందించే స్థాయి లేదు. ఆ కవిమూర్తికి సహస్రవందనాలు.. రావూరి రచన "పాకుడురాళ్ళు" చదవని వారు ఉంటారేమోకాని విననివాళ్ళులేరని ప్రగాఢ విశ్వాసం..
కవిత్రయం మనం చేసుకున్న పుణ్యం. తెలుగునేలకు పరిమళాలు మరోసారి వీచినవేళ నేడు. అదేమాదిరి ముగ్గురు జ్ఞానమూర్తుల ప్రభలు వెలిగిన నేల. నాడు భారతాన్ని తెనిగీకరించిన నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ. నేడు జ్ఞాన పీఠ పురస్కారాన్ని అందుకున్న తెలుగు తేజోమూర్తులు.. విశ్వనాథ, సినారే, రావూరి..
జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ముగ్గురితో పరిచయం నిజంగా ఏజన్మలో పుణ్యఫలమో..ఈ ముగ్గురినీ కలిసే, పలకరించే, వారి పలుకులు రాసే భాగ్యం ప్రసాదించింది పాత్రికేయ వృత్తే.
విజయవాడలో ఈనాడు ప్రతినిధిగా ఉన్నప్పుడు విశ్వనాథవారి అనేక సాహితీ కార్యక్రమాలకు హాజరై వార్తారూపం ఇచ్చే అవకాశం కలగడం నిజంగా అదృష్టమే. అలాగే సినారే నారాయణరెడ్డి గారితో పరిచయం మూడు దశాబ్దాలుగా ఇప్పటికీ సాగుతుండడం సత్కర్మ ఫలమే..
ఇక రావూరి గారు. ఆయనతో రెండు రకాల సంబంధ బాంధవ్యాలు. కవి-విలేకరి గా ఒకటి. ఇండియన్ఎక్స్ప్రెస్ సహచర పాత్రికేయ చాయాచిత్ర గ్రాహకుడు రావూరి కోటేశ్వరరవు తండ్రిగా ఆ పెద్దాయనతో మరో అనుబంధం.. అతి చనువుగా భుజాన చేయివేసి అప్యాయంగా పలకరించే మహోన్నత వ్యక్తి..ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించడం తెలుగు వారికి, తెలుగు భాషకు అమందానంద భరితం. ఆయనను అభినందించే స్థాయి లేదు. ఆ కవిమూర్తికి సహస్రవందనాలు.. రావూరి రచన "పాకుడురాళ్ళు" చదవని వారు ఉంటారేమోకాని విననివాళ్ళులేరని ప్రగాఢ విశ్వాసం..
ఈరోజు మనరాష్ట్రానికి మిశ్రమ ఫలాలలు. ప్రమాదం, ప్రమోదం, విషాదం, విచారం..పసలేని రాజకీయం..
తెలుగువెలుగు రావూరి భరద్వాజ గారికి ప్రతిష్ఠాకరమైన అత్యున్నత జ్ఞానపీఠ్ పురస్కారం లభించడం గర్వకారణం. ఆనందం.
బెంగళూరులో రెండు ప్రేలుళ్ళ సంఘటనలు. క్షతగాత్రులలో తెలుగు వారు ఉండడం విచారం.
భారత ఎన్నికల ప్రధానాధికారిగా, లా కమిషన్ సభ్యురాలిగా, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పలు బాధ్యతలు నిర్వర్తించిన విదుషీమణి తెలుగింటి ఆడపడుచు రమాదేవి కన్నుమూయడం అత్యంత బాధాకరం.
డిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై అధిష్ఠానంతో భేటీ కావడం ఉత్కంఠభరితం.
జగన్ అక్రమాస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ విచారణ పూర్తిచేసి తీర్పు రిజర్వు చేయడం నరాలు తెంచే థ్రిల్లింగ్ సస్పెన్స్
తెలుగువెలుగు రావూరి భరద్వాజ గారికి ప్రతిష్ఠాకరమైన అత్యున్నత జ్ఞానపీఠ్ పురస్కారం లభించడం గర్వకారణం. ఆనందం.
బెంగళూరులో రెండు ప్రేలుళ్ళ సంఘటనలు. క్షతగాత్రులలో తెలుగు వారు ఉండడం విచారం.
భారత ఎన్నికల ప్రధానాధికారిగా, లా కమిషన్ సభ్యురాలిగా, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పలు బాధ్యతలు నిర్వర్తించిన విదుషీమణి తెలుగింటి ఆడపడుచు రమాదేవి కన్నుమూయడం అత్యంత బాధాకరం.
డిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై అధిష్ఠానంతో భేటీ కావడం ఉత్కంఠభరితం.
జగన్ అక్రమాస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ విచారణ పూర్తిచేసి తీర్పు రిజర్వు చేయడం నరాలు తెంచే థ్రిల్లింగ్ సస్పెన్స్
Tuesday, 16 April 2013
మరణించినవారిపై వ్యాఖ్యలు సముచితమా?
పాత్రికేయులకు తగునా!
ద హిందు (హైదరాబాద్)డిప్యూటి ఎడిటర్ దివంగత రాజేంద్రప్రసాద్ రాసిన అంగ్ల పుస్తకాలకు తెలుగు అనువాదాలు నిన్న రాష్ట్ర రాజధానిలో ఆవిష్కృతమయ్యాయి. మర్రి చెన్నారెడ్డి డిసెంబరు 2, 1996 లో చెన్నైలో మరణించారు. అంటే అయన మరణించి 16 సంవత్సరాలైంది. అదే మాదిరి రాజేంద్రప్రసాద్ జనవరి 26, 2006 న మృతిచెందారు. చెన్నారెడ్డి మరణనించిన పదేళ్ళతరువాత మృతిచెందిన రచయిత ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తావించవలసి వచ్చిందో తెలియదు.అయితే చెన్నారెడ్డిని అవినీతిపరుడని డిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన విలేకరి వార్త రాశాడుట. అయితే ఆ విలేకరి నిజాయితీ ఏమిటో అర్ధం కాలేదు.
రాజకీయ నాయకుల అవినీతి ప్రపంచానికి తెలిసిందే, కొత్తేమీ ఉండదు. అయితే ఆ అవినీతి నాయకులతో రాసుకు, పూసుకు తిరిగి, అన్ని రాజోపచారాలు అందుకుంటున్న పాత్రికేయుల నీతి, నిజాయితీ ఎవరు చెప్పాలి. విలేకరుల అవినీతి చరిత్ర ఎవరు బయట పెట్టాలి.
"ఢిల్లీ నుంచి సండే మ్యాగజైన్ విలేకరి చెన్నారెడ్డి గారిపై వ్యాసం రాయడానికి హైదరాబాదు వచ్చారు. అతిధి గృహంలో బస, తిరగడానికి కారు, తోడుగా ఒక అధికారి ఇలా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విలాసవంతంగా తిరిగి, ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసి ఆయన గారు ఢిల్లీ వెళ్ళిపోయారు." డిల్లీ నుంచి వచ్చిన విలేకరికి ఆశించిన మూట అందలేదేమో!! మూటలు అందుకుంటున్న విలేకరులు ఊసరవెల్లులు మాదిరి రోజులో ఎలా మాటలు (రంగులు) మారుస్తున్నారో నిత్యం చూస్తునే ఉన్నారు ప్రజలు. చెన్నారెడ్డి తరువాత వచ్చిన సి ఎం లు స్ఫటిక సదృశ పరిశుద్ధులా?? 16 సంవత్సరాల కాలంగా తెలుగు నేలపై కొందరు వీర విలేకరుల చరిత్రలు తెలుసుకదా!! బాబు, వైఎస్సార్ నిజాయితీపరులా?? బాబు హయాంలో, వైఎస్సార్ హయాంలో కోట్లకు పడగలెత్తిన ఘనులు మన ఎదుటనే ఉన్నారు..
రాజేంద్రప్రసాద్ గారిపైకూడా విమర్శలు ఉన్నాయి కానీ మరణించిన వారిపై దిగజారి వ్యాఖ్యలు చేయడం సంస్కారం కాదు. ఆయన మాదిరే, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మెలగి మూడేళ్ళకిందట మరణించిన మరో గొలుసు ఆంగ్ల దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ పై గ్రంధాలే రాయచ్చు. ఆయన మృతిచెందితే ఆ సంస్థ సిబ్బందే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళలేదు. ఆ పత్రికకు చెందిన పాత్రికేయులే ఆయన అవినీతి భారతంపై పుస్తకం ప్రచురించారు. ఆయన చలవ వలన రెండు గొప్ప పత్రికలు నిర్జీవంగా తయారయ్యాయి. ఆయన కారణంగా 50 మందికి పైగా పత్రికా సిబ్బంది ఉద్యోగాలు పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆయన చనిపోతే ఆ కుటుంబాలు పండుగ చేసుకున్నాయి. .
Friday, 12 April 2013
అమ్ముడుబోతున్న పంచాంగ ప్రకండులు
చెక్క భజన చేసే విశ్లేషకులు
అమ్ముడుబోతున్న పంచాంగ ప్రకండులు, విలేఖరులగురించే నేను ఎప్పుడూ చెప్పేది. పండితులనండి, జ్యోతిషులనండి, సిద్ధాంతులనండి.. వారు ఉగాది ఒక్కరోజే సంభావనల కోసం కక్కుర్తిపడి ఘనంగా తాంబూలం ఇచ్చిన వారికి కీర్తనలు పాడతారు . కానీ వారినిమించి ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళా పాళా లేకుండా 24 గంటలూ చెక్క భజన చేసే జాతి మా విలే"ఖరులు"అనబడే విశ్లేషకులది.
[చీరాల కళాశల తెలుగు అధ్యాపకులు, తెలుగు అకాడెమి ఉపాధ్యక్షులు, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యులు, ఈనాడు పాత్రికేయ బోధనాలయ ప్రధాన అధ్యాపకుడు (ప్రిన్సిపాల్) (దివంగత)డా:బూదరాజు రాధాకృష్ణ, 1978లో మా శిక్షణా తరగతుల్లో బోధిస్తూ-- "ఇప్పటివారికి అక్షరం ముక్క రాయడం రాదు. వీళ్ళు లే"కరులు" కాదు. ఓండ్రపెట్టి అరవడమే పని, అందుకే లే"ఖరులు"..--అని వాత పెట్టేవారు. పత్రికల్లొ "ఖరులు" వుండకూడదని, అందుకే విలేకరి అని రాయించేవారు]
నిన్నటికి నిన్న చూడండి (మూడేళ్ళ క్రితం, మళ్ళీ మొన్న నేను రాశా -- "పంచాంగ ప్రకండులు" ) పార్టీ కార్యాలయాల్లో సిద్ధాంతులు క్యూలుకట్టి నాయకులను తెగపొగిడేసారు. నమస్తే తెలంగణా పత్రిక నిన్నటిరోజు ఉగాది పంచాంగం వార్తకు ఇవాల్టి సంచికలో "ఏ పార్టీ దగ్గర ఆ పాట"; ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికలు ఒకే శీర్షిక "ఎవరి పంచాంగం వారిదే" అని ప్రచురించాయి.
అలాంటిదే.. టీవీ ప్రేక్షకులకు దైనందిన ఉచిత వినోదం,(విషాదం) వేడుక ఉదయం అన్ని చానళ్లలో నాటి పత్రికల వార్తలపై విశ్లేషణ అనే కార్యక్రమం. సాక్షి, టీవీ9, టిన్యూస్, హెచ్ఎం టీవి, మహా టీవి, వి6, ఎన్టీవి లాంటి ప్రధాన బుల్లిపెట్టెలు చూడండి. శ్రీకృష్ణ పరమాత్ములవలె ఎక్కడ పట్టినా వారే దర్శనమిస్తారు. రొటేషన్ విధానంలో చానళ్ళు పంచుకుంటారు. రోజుకొకరు, ఒక చానల్ లో ప్రత్యక్షం. అపార విషయ పరిజ్ఞానమున్న వారేమీకాదు. వేర్వేరు దినపత్రికల్లో "విలేఖరులు" గా పనిచెస్తున్న వారే. వారి పత్రికల్లో వారు రాసిన వార్త ఒక్కటీ ఎప్పుడూ వాస్తవరూపం దాల్చలేదు. ఊహాగానల పేరిట ఎవరిష్టం ఒచ్చినట్లు వారు రాయడమే. అవి కథలు, కథనాలు. వారిని ప్రశ్నించే యాజమాన్యాలు లేవు.
ఒక విధానం (పాలసీ) ఉన్న పత్రికకు చెందిన ఉద్యోగి తద్విరుధ్ధ విధానం అనుసరిస్తున్న పత్రికలో, చానల్లో ఎలా భావ ప్రకటన చేస్తాడు? యాజమాన్యాలు ఎలా అనుమతిస్తున్నాయి? విశ్లేషకులలో ఒక్కరూ ఎడిటర్ స్థాయిలో వారు కాదు. అందునా అయిదారేళ్ల కిందట కలాలు కిందపడేసి ఇతర వ్యాపకాలు , వ్యాపారాలలో మునిగి తేలుతూ ప్రస్తుతం ఉబుసుపోని వారు కనిపిస్తారు. ఒకరిద్దరైతే అసలు ఎప్పుడూ పత్రికల్లో పని చేసిన పాపాన పోనివారే. కొందరైతే పత్రికా రంగం నుంచి కనుమరుగై చానళ్ళ పుణ్యమా అని ప్రవేశించినవారూ ఉన్నారు. నిజానికి అపార అనుభవం ఉన్న ఎడిటర్లు విశ్లేషణ చేస్తే ఒక విలువ. పదవీ విరమణ చేసిన ప్రముఖ పాత్రికేయులు చాలా అరుదుగా బుల్లి తెరపై కనిపిస్తారు. ఇప్పటి విశ్లేషకుల్లో పలువురు హైదరాబద్ నుంచి కాలు కదపని వారే. ఉదయాన్నే పత్రికలు చదివి పుక్కిట పట్టి వస్తారు. మరో విశేషమేమిటంటే ఇవ్వాళ ఒక చానల్లో ఒక విశ్లేషకుడు వెలువరించిన అభిప్రాయం రేపు మరో చానల్ కు మారుతుంది. ఏ చానల్ మాటా ఆ చానల్కే. (ఏ గూటి పక్షి ఆ గూటి పలుకు పలుకుతుంది) పగలల్లా ఉద్యోగ బాధ్యతలకు విరామం ఇచ్చి తెల్లవారుతూనే చానళ్లలో ప్రత్యక్షం..
ఈ విశ్లేషకుల సత్తా తెలిసినందునే మంచి కాని, చెడు కాని "ఈనాడు", "ఆంధ్రజ్యోతి" చానళ్ళు విలేఖరులకు విశ్లేషకులుగా స్థానం కల్పించలేదు. విశ్లేషకులది గుడుగుడు గుంజం.. నేను చెప్పింది నిజమోకాదో మిత్రులు ఒక్క వారం రోజులు విసుగు భరించి, నన్ను శపిస్తూ విశ్లేషకులను గమనించండి. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దు, హిందీ జాతీయ పత్రికల్లో, దేశంలో పలు కేంద్రాల్లో పని చేసి పదవీ విరమణ చేసిన ఉద్దండులు, ఎడిటర్లు, ప్రస్తుతమూ పనిచేస్తున్న పలువురు ప్రముఖులు ఉండగా వారికి ఎందుకు అవకాశం లభించడం లేదు? వారు రాజీపడరు గనుక, కీర్తించరు గనుక, భజన చేయరు గనుక.. విశ్లేషకుల్లో ఒకరిద్దరు అనుభవజ్ఞులున్నా వారికీ మసి అంటుతున్నది పాపం.
Monday, 8 April 2013
ఎప్పుడైనా...ఎక్కడైనా, ఏ రాష్ట్రానికైనా మనకు పట్టిన
ఇంతటి దుర్గతి.. అధోగతి పట్టిందా?
ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, అసలు ఎప్పుడైనా...ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా మనకు పట్టినంతటి దుర్గతి.. కాదు కాదు, అధోగతి పట్టిందా? ఇందరు మంత్రులు, రాజకీయ తాబేదారులు, అధికారులు నెలలు, ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గుతున్నారంటే కారణం అవినీతి కదా. ఒక కేంద్ర ప్రభుత్వ నేర దర్యాప్తు సంస్థ, దేసంలొ అత్యున్నత న్యాయస్థానం (అక్కడ, ఇక్కద) పాలకపక్షంలొని బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారిని ఘోర అవినీతికి బాధ్యులు చేసి ఆరోపణలు గుప్పించి కటకటాల వెనుకకు నెట్టడం ఎంత సిగ్గు మాలిన తనం.ఆరుగురు మంత్రులను సుప్రీం కోర్టు నోటీసులిస్తే తలేత్తుకుని ఎలా తిరుగుతున్నారో? వెంటనే రాజీనామా చేయకుండా తమ నేరాలను మాఫీ చేసుకునే ప్రయత్నాలకు పదును పెట్టుకుంటూ ఆ మంత్రి పదవుల్లో ఎలా కొనసాగుతున్నారు.
ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరస్థులుగా ముద్రపదద్దం వారిని ఎన్నుకున్న ఆ ప్రజలకెంత అవమానం. ఒక రాష్ట్ర డిజిపి పై అదే స్థాయి మరో ఐ పి సి అధికారి అవినీతి ఆరోపణలు చేయడం, ఆ నేరారోపణ చేసిన అధికారి ఫోర్జరీ నేరారోపణను న్యాయస్థానంలో ఎదుర్కుంటుండడం ఈ రాష్ట్రానికే ఎంత అవమానకరం. డిజిపి నియామకమే అసంబద్ధమని కోర్టు పేర్కోనడం పాలనా వ్యవస్థకు, ప్రభుత్వానికి సిగ్గు పోయినట్లు లేదా? సి బి ఐ అదొక సీరియల్ కథమాదిరి అయిదు చార్జిషీట్లు దాఖలుచేసి సాక్షాత్తు హోం మంత్రినే నిందితురాలుగా చెప్పడం ఈ ప్రభుత్వానికి తల తీసినత్లు, ప్రాణం పోయినట్లనిపించడం లేదా! ఐదో చార్జిషీట్లో జగన్, విజయ సాయి రెడ్డి, పునితా దాల్మియా, సబిత, శ్రీలక్ష్మి, రాజగోపాల్, దివాకర్ రెడ్డి, సంజయ్ మిశ్రా, నీల్ కమల్, జయదీప్, రఘురాం సిమెంట్స్, ఈశ్వరి సిమెంట్స్, దాల్మియా లను నిందితులుగా చేర్చింది. వీరు గాక ఇప్పటికే మంత్రులు పార్థసారధి, పొన్నాల, గీతారెడ్డి, కన్నా లక్ష్మినారయణ వేర్వేరు ఆరోపనలు ఎదుర్కోంటూ ఇంకా పదవుల్లొ సాగడం మన ప్రజా స్వామ్య విలువలను పాతరేయడం కాదా?
ఒక ముఖ్యమంత్రి నేరుగా బంధు ప్రీతికి, ఆశ్రితజన పక్షపాతానికి పాల్పడ్డాడని నేరుగా ఆరోపించడం ఈ రాష్ట్రానికి వన్నె చేకూరుస్తుందా? అసలు కీలక వ్యక్తులు, సూత్రధారులు, పాత్రధారులు ఇంకా చట్టం పరిధిలోకి రాకుండా తప్పించుకుంటునే ఉన్నారు. దీనికి తోడు మరో నిష్ట దౌర్భాగ్యం ఏమిటంటే, పత్రికా యజమానులు, వివిధ స్థాయిల్లోని సిబ్బంది అనేక నేరారోపణలపై జైళ్ళకు వెళ్ళారు. మరి కొందరు బయట ఉన్నారు. 62 పజీల అయిదో చార్జిషీట్లో 13 మందిని నిందితులుగా, 42 మందిని సాక్షులుగా పేర్కొన్నది.
66 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి ఈ ఘట్టం చెరగని మచ్చగా మిగిలింది. నిజంగా, మరింత నిఖార్సుగా సి.బి.ఐ. దర్యాప్తు జరిగితే మరెందరు కటకటాలవెనుకకు పోతారో? ఎన్ని జైళ్ళు నిండుతాయో? ఈ కేసులు ఎప్పటికి నిగ్గుతేలి నేరస్థులకు ఎప్పుడు ఎంత శిక్ష పడుతుందో.. ఆ భగవంతునికే ఎరుక..అదను కోసం గోడ దూకేందుకు మరిన్ని పిల్లులు క్యూలో ఉన్నయిట. ఈ చారిత్రాత్మక వాస్తవాలు బయటకు రాకుందా కొన్ని పత్రికలు, కొందరు పాత్రికేయులు మసిపూసేందుకు సిద్ధమవుతుందగా వైరివర్గంలో పత్రికలు, పాత్రికేయులు కొత్త కథనాలతొ వంటకాలు వడ్డించి రంగులు పులిమి ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అయోమయంలో పడవేసేందుకు ఎత్తులు, పైఎత్తులకు రెడీ అవుతున్నాయి.
ఏళ్ళకిందటే ఈ అవినీతి భాగోతానికి పునాదులు వేసి, ఇప్పుడు సుద్దపూసల్లా బయటకూర్చుని ప్రజలకు టోపీ పెట్టి, తాము బయటపడి చేతులు కడుక్కునేందుకు పాత పాలకులు ఆడుతున్న నాటకాలనూ ప్రజలు గమనిస్తునే ఉన్నారు. ప్రజలు అమాయకులు, వెర్రి గొర్రెలనుకుంటె సమయం చూసి కొర్రు కాల్చి సరైన వాతలు పెట్టి రోగాలు కుదురుస్తారు.
ఇంతటి దుర్గతి.. అధోగతి పట్టిందా?
ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, అసలు ఎప్పుడైనా...ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా మనకు పట్టినంతటి దుర్గతి.. కాదు కాదు, అధోగతి పట్టిందా? ఇందరు మంత్రులు, రాజకీయ తాబేదారులు, అధికారులు నెలలు, ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గుతున్నారంటే కారణం అవినీతి కదా. ఒక కేంద్ర ప్రభుత్వ నేర దర్యాప్తు సంస్థ, దేసంలొ అత్యున్నత న్యాయస్థానం (అక్కడ, ఇక్కద) పాలకపక్షంలొని బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారిని ఘోర అవినీతికి బాధ్యులు చేసి ఆరోపణలు గుప్పించి కటకటాల వెనుకకు నెట్టడం ఎంత సిగ్గు మాలిన తనం.ఆరుగురు మంత్రులను సుప్రీం కోర్టు నోటీసులిస్తే తలేత్తుకుని ఎలా తిరుగుతున్నారో? వెంటనే రాజీనామా చేయకుండా తమ నేరాలను మాఫీ చేసుకునే ప్రయత్నాలకు పదును పెట్టుకుంటూ ఆ మంత్రి పదవుల్లో ఎలా కొనసాగుతున్నారు.
ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరస్థులుగా ముద్రపదద్దం వారిని ఎన్నుకున్న ఆ ప్రజలకెంత అవమానం. ఒక రాష్ట్ర డిజిపి పై అదే స్థాయి మరో ఐ పి సి అధికారి అవినీతి ఆరోపణలు చేయడం, ఆ నేరారోపణ చేసిన అధికారి ఫోర్జరీ నేరారోపణను న్యాయస్థానంలో ఎదుర్కుంటుండడం ఈ రాష్ట్రానికే ఎంత అవమానకరం. డిజిపి నియామకమే అసంబద్ధమని కోర్టు పేర్కోనడం పాలనా వ్యవస్థకు, ప్రభుత్వానికి సిగ్గు పోయినట్లు లేదా? సి బి ఐ అదొక సీరియల్ కథమాదిరి అయిదు చార్జిషీట్లు దాఖలుచేసి సాక్షాత్తు హోం మంత్రినే నిందితురాలుగా చెప్పడం ఈ ప్రభుత్వానికి తల తీసినత్లు, ప్రాణం పోయినట్లనిపించడం లేదా! ఐదో చార్జిషీట్లో జగన్, విజయ సాయి రెడ్డి, పునితా దాల్మియా, సబిత, శ్రీలక్ష్మి, రాజగోపాల్, దివాకర్ రెడ్డి, సంజయ్ మిశ్రా, నీల్ కమల్, జయదీప్, రఘురాం సిమెంట్స్, ఈశ్వరి సిమెంట్స్, దాల్మియా లను నిందితులుగా చేర్చింది. వీరు గాక ఇప్పటికే మంత్రులు పార్థసారధి, పొన్నాల, గీతారెడ్డి, కన్నా లక్ష్మినారయణ వేర్వేరు ఆరోపనలు ఎదుర్కోంటూ ఇంకా పదవుల్లొ సాగడం మన ప్రజా స్వామ్య విలువలను పాతరేయడం కాదా?
ఒక ముఖ్యమంత్రి నేరుగా బంధు ప్రీతికి, ఆశ్రితజన పక్షపాతానికి పాల్పడ్డాడని నేరుగా ఆరోపించడం ఈ రాష్ట్రానికి వన్నె చేకూరుస్తుందా? అసలు కీలక వ్యక్తులు, సూత్రధారులు, పాత్రధారులు ఇంకా చట్టం పరిధిలోకి రాకుండా తప్పించుకుంటునే ఉన్నారు. దీనికి తోడు మరో నిష్ట దౌర్భాగ్యం ఏమిటంటే, పత్రికా యజమానులు, వివిధ స్థాయిల్లోని సిబ్బంది అనేక నేరారోపణలపై జైళ్ళకు వెళ్ళారు. మరి కొందరు బయట ఉన్నారు. 62 పజీల అయిదో చార్జిషీట్లో 13 మందిని నిందితులుగా, 42 మందిని సాక్షులుగా పేర్కొన్నది.
66 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి ఈ ఘట్టం చెరగని మచ్చగా మిగిలింది. నిజంగా, మరింత నిఖార్సుగా సి.బి.ఐ. దర్యాప్తు జరిగితే మరెందరు కటకటాలవెనుకకు పోతారో? ఎన్ని జైళ్ళు నిండుతాయో? ఈ కేసులు ఎప్పటికి నిగ్గుతేలి నేరస్థులకు ఎప్పుడు ఎంత శిక్ష పడుతుందో.. ఆ భగవంతునికే ఎరుక..అదను కోసం గోడ దూకేందుకు మరిన్ని పిల్లులు క్యూలో ఉన్నయిట. ఈ చారిత్రాత్మక వాస్తవాలు బయటకు రాకుందా కొన్ని పత్రికలు, కొందరు పాత్రికేయులు మసిపూసేందుకు సిద్ధమవుతుందగా వైరివర్గంలో పత్రికలు, పాత్రికేయులు కొత్త కథనాలతొ వంటకాలు వడ్డించి రంగులు పులిమి ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అయోమయంలో పడవేసేందుకు ఎత్తులు, పైఎత్తులకు రెడీ అవుతున్నాయి.
ఏళ్ళకిందటే ఈ అవినీతి భాగోతానికి పునాదులు వేసి, ఇప్పుడు సుద్దపూసల్లా బయటకూర్చుని ప్రజలకు టోపీ పెట్టి, తాము బయటపడి చేతులు కడుక్కునేందుకు పాత పాలకులు ఆడుతున్న నాటకాలనూ ప్రజలు గమనిస్తునే ఉన్నారు. ప్రజలు అమాయకులు, వెర్రి గొర్రెలనుకుంటె సమయం చూసి కొర్రు కాల్చి సరైన వాతలు పెట్టి రోగాలు కుదురుస్తారు.
Subscribe to:
Posts (Atom)